ఇదిగో నేను తెచ్చిన నిధుల వివరాలు…
ఇంటింటికీ పంపుతున్నా…..
కరీంనగర్ కోసం కొట్లాడి జైలుకు పోయినోడిని
నిరంతరం కరీంనగర్ అభివ్రుద్ధి కోసం తపిస్తున్న
రెండేళ్లలో కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి?
6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేసినందుకు ఓటేయాలా?
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి
కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు…
కిసాన్ నగర్, కాపువాడ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన జనం
బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఝ చేయించిన బండి సంజయ్
‘‘గంగుల కమలాకర్…నేను నయాపైసా తీసుకురాలేదని అబద్దాలాడుతున్నవు కదా. నేను పైసలు తెచ్చినట్లు నిరూపిస్తే కరీంనగర్ వదిలి వెళ్లిపోతానని అన్నావ్ కదా…. ఇదిగో బుక్ లెట్. కరీంనగర్ కోసం నేను ఎన్ని నిధులు తెచ్చానో, ఏయే అభివ్రుద్ది పనులు చేశానో ఆ వివరాలన్నీ ఈ బుక్ లెట్ లో ఉన్నయ్. 5 లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి ఇంటింటికీ పంపుతున్నా. వందల కోట్ల రూపాయల నిధుల వివరాలన్నీ అందులో ఉన్నయ్. ఇగ అన్నమాట ప్రకారం… నువ్వు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతావా?..వెళ్లిపో….’’అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బండి సంజయ్ తొలిరోజు కిసాన్ నగర్, కాపువాడ మారుతీనగర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పాల్గొని ప్రసంగించారు. వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్ కరీంనగర్ అభివ్రుద్ధి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
ఇగ బీఆర్ఎస్ విషయానికొస్తే… పదేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారు? అవినీతి, అక్రమాలు, కబ్జాలు చేసి పేదల ఉసురు పోసుకున్నరు. కబ్జాలకు పాల్పడి జైలుకు పోయినోళ్లలో సగం మందికి బీఆర్ఎస్ లో టిక్కెట్లు ఇచ్చారు. వాళ్లకు ఓట్లేసే ఇగ మీ జాగాలతోపాటు పుస్తెల తాడు కూడా గుంజుకుపోతారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. నేను నయాపైసా తీసుకురాలేదని అబద్దాలాడుతున్నరు. ఇదిగో బుక్ లెట్. నేను కరీంనగర్ కోసం ఎన్ని నిధులు తెచ్చాను, ఏయే అభివ్రుద్ది పనులు చేశానో వివరాలన్నీ ఈ బుక్ లెట్ రూపొందించిన. 5 లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి ఇంటింటికీ పంపుతున్నా. వందల కోట్ల రూపాయల నిధుల వివరాలన్నీ అందులో ఉన్నయ్. గంగుల కమలాకర్… ఇగ నువ్వు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతావా?..వెళ్లిపో…. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ కన్పించలే. ప్రజలు ఆయనను ఎన్నడో మర్చిపోయారు. ఆయన మాటలను ఎవరు పట్టించుకుంటారు? కేంద్రంలో, అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓట్లేసి ప్రయోజనం ఏమిటి? బీఆర్ఎస్ కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. పొరపాటున బీఆర్ఎస్ ను గెలిపిస్తే… కేంద్రం ఇచ్చిన పైసలను దారి మళ్లించి కమీషన్లు దొబ్బుకుంటారే తప్ప చేసేదేమీ లేదు.
కిసాన్ నగర్ సభలో స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మా బంధువులు ఆకుల కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నయ్. చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్న. 10 ఏళ్ల క్రితం ఎట్లుండేది? ఇప్పుడు ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ జరిగిన అభివ్రుద్ది నిధులన్నీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చినవే… ఇప్పుడు మళ్లీ మీ ముందుకొచ్చిన 28, 29, 30 డివిజన్ బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. మరిన్ని నిధులు తెచ్చి ఇంకా అభివ్రుద్ది చేస్తా.’’’అని అన్నారు. కాపు వాడ సభలో మాట్లాడుతూ ‘‘నేను ఇక్కడే పుట్టి పెరిగిన. నేను కాపువాడ బిడ్డను. పెద్ద ఎత్తున పైసలు తీసుకొచ్చి అభివ్రుద్ది చేస్తా’’అని భరోసా ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మోదీ వద్దకు కార్పొరేటర్లను తీసుకుపోయి నిధులు తెస్తానని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ…‘కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యని కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు. 6 గ్యారంటీలు, మేనిఫెస్టో హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి?’’అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ ఇంఛార్జీ డాక్టర్ జి.మనోహర్ రెడ్డితోపాటు 28, 29, 30, 35, 36 వార్డుల బీజేపీ అభ్యర్థులు కుర్ర రాజేశం, సోమిడి వేణు, నక్క సరితా సుభాషిణి, సాధవేని సుజాత, తోట అనిల్ పాల్గొన్నారు.