*బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరిక
(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)
‘
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీఆర్ఎస్ సీనియర్ నేత, 35వ వార్డు కార్పొరేటర్ సాధవేని శ్రీనివాస్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బండి ప్రశాంత్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితం తమ అనుచరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిశారు. వారికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
బండి సంజయ్ కరీంనగర్ అభివ్రుద్ధి కోసం నయాపైసా తీసుకురాలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్ధికి కేంద్రం తెచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. కేంద్రం నుండి దాదాపు 1500 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చి కరీంనగర్ ను అభివ్రుద్ది చేశానని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ కళ్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. ఎలక్షన్స్ సమయంలో తప్ప కరీంనగర్ ముఖం చూడని నాయకులు తనపై ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజల పక్షాన నేను చేసిన పోరాటాలు, కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చానో, ఏయే ప్రాజెక్టులు, పథకాలు తీసుకొచ్చానే ప్రజలకు తెలుసనని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో మీ కళ్ల ముందు కన్పిస్తున్న ప్రతి పని, జరిగిన అభివ్రుద్ది కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందనేది ముమ్మాటికీ నిజం. ఎన్నికల ప్రచారంలో పూర్తి వివరాలతో ప్రజలకు ముందుకు వెళతానని స్పష్టం చేశారు.