హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణలో మంత్రిమండలి విస్తరణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈనెల 17న కొత్తగా మరో ఆరుగురికి చోటు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం గవర్నర్ నరసింహన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఇప్పటకే కొంతమందికి బెర్త్ లు ఖరారు చేసినట్లు..వీరంతా అందుబాటులో ఉండాలని చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం 12 మంది సభ్యులు..
మంత్రిమండలిలో సీఎంతో సహా 12 మంది సభ్యులున్నారు. నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో 18 మంది సభ్యులుండవచ్చు. మరో ఆరుగురికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొన్ని శాఖలకు మంత్రులు లేరు. ఈ శాఖలకు మంత్రులను కేటాయించే అవకాశం ఉంది.
ఎవరికి రావచ్చు ?
ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ నుండి జూపల్లి కృష్ణా రావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లలో ఇద్దరికి బెర్త్ లు ఖరారయ్యే అవకాశం ఉండవచ్చు. ఇక ఖమ్మం జిల్లా నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది. ఈయన ఇటీవలే టిడిపి నుండి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్ స్థానం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుండి కొండా సురేఖ, చందూలాల్ లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. హైదరాబాద్ నుండి ఎస్టీ కోటాలో రాములు నాయక్ కు మంత్రి పదవి వస్తుందని కొంతమంది ఆశిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.