మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నారు
అభివ్రుద్దితో కరీంనగర్ రూపురేఖలు మార్చాలనే తపన మాది
మేయర్ పీఠాన్ని అప్పగిస్తే అభివ్రుద్ధి చేసి చూపిస్తాం
గెలిచే చోట బీజేపీ కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తాం
సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
సంజయ్ సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతల చేరిక
(పొలిటికల్ ఫ్యాక్టరీ – కరీంనగర్)
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మజ్లిస్ లో ఒక వర్గం నేతలతో కాంగ్రెస్, మరో వర్గంతో బీఆర్ఎస్ నేతలు ఒప్పందం కుదుర్చుకుని మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. తాము మాత్రం అభివ్రుద్ధి మంత్రంతోనే ప్రజల్లోకి వెళుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతోనే కరీంనగర్ లో అభివ్రుద్ధి పనులు సాగుతున్నాయని, బీజేపీని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని చెప్పారు. పొరపాటున ఇతర పార్టీలకు ఓట్లేస్తే అభివ్రుద్ధి పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈరోజు సాయంత్రం క46వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకట్ రెడ్డి ఆధ్వర్వంలో పలువురు కాంగ్రెస్ నేతలతోపాటు బీఆర్ఎస్ కు సంబంధించి 10వ డివిజన్ కు చెందిన సాగాని కొమరయ్య సార్, 30వ డివిజన్ కు చెందిన నక్క రాజేశ్వరరావు, 48వ డివిజన్ కు చెందిన కర్రి అనిల్ కుమార్, 4వ డివిజన్ కు చెందిన దుర్శేడు మురళి, 47వ డివిజన్ కు చెందిన శ్రీరాం నరేందర్ లు తమ వందలాది మంది అనుచరులతో వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కరీంనగర్ ఎంపీ కార్యాయలంలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ కాషాయ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు ఓదెలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలను, కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. ఏమన్నారంటే…
నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధిని చూసి, బీజేపీ సిద్దాంతాలు నచ్చి బీజేపీలో చేరుతున్న నాయకులకు స్వాగతం. కరీంనగర్ అభివ్రుద్ధి చెందిందంటే కేంద్ర నిధులే ప్రధాన కారణం. అభివ్రుద్దే లక్ష్యంగా, అభివ్రుద్దే మంత్రంగా బీజేపీ ఎన్నికల్లోకి వెళుతున్నాం. బీజేపీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీకి అప్పగిస్తే అత్యధిక నిధులు తెచ్చి మరింత అభివ్రుద్ధి చేస్తాం. లేకుంటే అభివ్రుద్ధి పనులు ఆగే ప్రమాదముంది.పనులు ఆగొద్దంటే కేంద్ర నిధులే శరణ్యం. కరీంనగర్ ను అభివ్రుద్ధి చేయాలనే తపన మాలో ఉంది.
సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇస్తాం. బీజేపీ కార్యకర్తలు గెలిచే అవకాశాలు ఉన్న చోట వాళ్లకే టిక్కెట్లు ఇస్తాం… అక్కడ గెలిచే అవకాశం. కార్యకర్తలు గెలిచే అవకాశం లేనిచోట సర్వే నిర్వహించి ఇతరులకు టిక్కెట్లు ఇస్తాం. అందుకోసం త్రిసభ్య కమిటీ వేశాం. వాళ్లే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు.
మేం అభివ్రుద్ధితో వస్తున్నాం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో కలిసి మతతత్వంతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నాయి. వాస్తవాలు గుర్తించాలి. పార్టీలో చేరిన నేతలంతా కష్టపడి పనిచేయండి. ప్రజల మన్ననలు పొందండి. కరీంనగర్ రూపురేఖలను మార్చాలనే తపనతో ఉన్నాం. ప్లాన్ రడీగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ కలిసి లోపాయికారీ ఒప్పందంతో మతం పేరుతో బీజేపీని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు. ఎవరు వచ్చినా బీజేపీ గెలుపు ఆప తరం కాదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం.