యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యులు
శంతను నారాయణ్ తో చర్చించారు.
హైదరాబాద్ లో శంతను నారాయణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చించారు.
మాన్యుఫాక్చరింగ్ రంగంలో తెలంగాణను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు, ప్రముఖ సంస్థలను ఆకర్షించడానికి సరైన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఏఐలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై శంతను నారాయణ్ తో ముఖ్యమంత్రి చర్చించారు.
సాంకేతిక రంగంతో పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు